హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 29(నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు నాలుగో సింహం కదిలింది. ఒకవైపే చూస్తున్నదంటూ శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంతో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై పోలీసుల వర్గాల్లో కదలిక రాగా, రేవంత్రెడ్డి సన్నిహితుడు కిరణ్ పాత్రపైనా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ నెల 2న మాదాపూర్ పీఎస్లో హరికృష్ణపై మధుసూదన్రెడ్డి ఫిర్యాదు చేసి నెల రోజులైనా చర్యలు లేకపోవడాన్ని కథనంలో ప్రస్తావించడంతో పోలీసులు నిజాలు తేల్చే పనిలో పడ్డారు. ఈ నెల 20న సుమంత్ కేసు అయిన ఒకట్రెండు రోజుల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, కానీ ఫిర్యాదులో డబ్బుల వ్యవహారం ఉన్నందున వివరాల్లేకనే విచారణ ఆలస్యమైందని మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు చెప్పారు.
ఇంకా హరికృష్ణను అరెస్ట్ చేయలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా సీఎం కోటరీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్న కిరణ్ ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుమంత్తోపాటు ఈ కేసులో కీలక పాత్రధారి కిరణ్ను మాత్రం ఎవరూ ప్రశ్నించకపోవడం, అరెస్ట్ చేయకుండా సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తున్నట్టు కమిషనరేట్లో చర్చ జరుగుతున్నది. గతంలో రేవంత్కు పీఏగా ఉండి ఐదేండ్ల కిందట అరస్టైన సందర్భంలో కిరణ్ ఉన్న ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధుసూదన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో నిజాంపేటలోని ఐదెకరాల భూ వివాదాన్ని పరిష్కరించి అన్ని డాక్యుమెంట్లు ఇస్తానంటూ తనకున్న మంత్రులు, అధికారుల పరిచయాలతో సమస్య పరిష్కరిస్తానని చెప్పారని పేర్కొన్నారు.
అయితే హరికృష్ణ ఈ ఒక్క వివాదమే కాకుండా పలుచోట్ల సుమంత్, కొండాల పేర్లు చెప్పి పెద్ద ఎత్తున వసూలు చేసినట్టు బాధితులు సుమంత్కు చెప్పడంతో ఈ దాడులు జరిగి కొండా సుస్మిత పరకాలలో సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలతో సుమంత్పై కేసుల వరకు పోయాయి. ఈ నేపథ్యంలోనే హరికృష్ణపై తాను ఇచ్చిన ఫిర్యాదు గురించి మధుసూదన్రెడ్డి పోలీసులకు చెప్పడంతో అప్పటికప్పుడే హరికృష్ణపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మరి ఇన్ని రోజులుగా తమ వద్ద ఫిర్యాదు పెట్టుకుని ఎందుకు జాప్యం చేశారంటే రకరకాల సాకులు చెబుతూ తమపై ఒత్తిడిని బయటపడనీయకుండా ఆ పీఎస్ అధికారి మేనేజ్ చేస్తున్నట్లు సైబరాబాద్లో చర్చ జరుగుతున్నది.
ఒక్క నిజాంపేట మాత్రమే కాకుండా జనగామ, భూపాలపల్లి, భువనగిరిలతో పాటు ఒక ప్రతిపక్షపార్టీ నేత దగ్గర భూమికి సంబంధించిన ఎన్వోసీలు చేస్తానంటూ రూ.కోట్లు వసూలు చేసినట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుండగా నిఘా వర్గాలు ఈ భూదందా వివరాలు తేల్చే పనిలో పడ్డాయి. మొత్తమ్మీద సుమంత్ కేసు నేపథ్యంలో మల్కాజిగిరిలో జీరో ఎఫ్ఐఆర్ మొదలు హైదరాబాద్లో కేసు నమోదు కాగా ఈ రెండు కమిషనరేట్లలో బాధితుడుగా ఉన్న హరికృష్ణపై సైబరాబాద్లో కేసు నమోదైంది. తెగేదాకా లాగకూడదని, కేసులు పెడితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులే మొదట బాధితుడికి, నిందితుడికి సలహా ఇచ్చి ఆ తర్వాత వారే స్వయంగా హరికృష్ణతో దరఖాస్తు ఇప్పించి కేసులు పెట్టించడం, తిరిగి అదే హరికృష్ణపై పిటిషన్ వచ్చినా కేసు పెట్టకపోతే మళ్లీ వ్యవహారం ఎటు తిరుగుతుందోనని హడావిడిగా కేసు పెట్టడం గమనార్హం.