హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): బిర్లా బ్లూ ఫ్లేమ్స్ లిమిటెడ్ పేరిట 26 ఏండ్ల క్రితం సిలిండర్ల కుంభకోణంలో ఏ-2 నిందితుడు, జగ్మితా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చైర్మన్ అశోక్ బిస్వాస్ను ఎట్టకేలకు తెలంగాణ సీఐడీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ తెలిపారు. అతి తక్కువ ధరకే సిలిండర్లు ఇస్తామని ఛత్తీస్గఢ్ కేంద్రం గా ‘బిర్లా బ్లూ ఫ్లేమ్స్ లిమిటెడ్’ కంపెనీని ఏర్పాటు చేశారు. దాని ద్వారా 1994 నుంచి 1995 వరకు ఆంధ్రప్రదేశ్సహా వివిధ రాష్ర్టాల్లో ప్రజల నుంచి రూ.1,22,91,200 వసూలు చేశారు. డబ్బు చెల్లించిన వారికి సిలిండర్లు ఇవ్వకపోవడంతో ఒడిశాకు చెందిన పలువురు బాధితులు బిర్లా బ్లూ ఫ్లేమ్స్ సంస్థపై కేసు వేశారు.
ఈ కేసును తెలంగాణ సీఐడీకి బదిలీ చేశారు. ఇటీవల పెండింగ్ నాన్ బెయిలబుల్ కేసులను పరిష్కరించే క్రమంలో ఈ కేసు వివరాలు సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ తెలుసుకున్నారు. ఎన్బీడబ్ల్యూ విభాగం ఎస్పీ రాంరెడ్డికి ఈ కేసు బాధ్యతలను అప్పగించారు. ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఒడిశాకు వెళ్లి ఈ కేసులో ఏ-2 నిందితుడు అశోక్ బిస్వాస్ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ ప్రత్యేక బృందానికి త్వరలో రివార్డులు అందజేస్తామని ఏడీజీ మహేశ్ భగవత్ తెలిపారు.