హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు కసరత్తు మొదలైంది. సంబంధిత ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణకు అంగీకారాన్ని కోరుతూ జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, శాతవాహన వర్సిటీలకు ఇటీవల లేఖలు రాశారు. నిరుడు ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించిన వర్సిటీలకే ఈసారి కూడా అవకాశం కల్పించనున్నట్టు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రవేశ పరీక్షలన్నీ మేలో జరగనున్నాయి.
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మే రెండో వారంలో జరగనున్నది. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఈసారి సైతం జేఎన్టీయూహెచ్కే అప్పగించనున్నారు. ఉన్నత విద్యామండలి లేఖలకు స్పందించిన వర్సిటీల వీసీలు.. కన్వీనర్ల ఎంపిక కోసం ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ఉన్నత విద్యామండలికి ప్రతిపాదించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ నిర్వహణకు శాతవాహన వర్సిటీ ఆసక్తి చూపింది. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఆ వర్సిటీ ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ప్రతిపాదించింది.