హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) సిద్ధమైంది. పండుగ తర్వాత గురుకులాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలైంది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు తమ గురుకులాల్లో ఖాళీలను గుర్తించి తొలుత ప్రభుత్వానికి మొత్తంగా 9,096 పోస్టుల ప్రతిపాదనలను పంపించాయి. వాటికి ఆర్థికశాఖ ఆమోదం లభించింది. అనంతరం సర్కారు అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా గురుకులాలకు సైతం 2,591 పోస్టులను కేటాయించింది. ఇటీవల ఆ పోస్టులకు కూడా ఆర్థికశాఖ ఆమోదం లభించింది. దీంతో మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో సంక్రాంతి తర్వాత ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు సిద్ధమవుతున్నది. రోస్టర్ ప్రాతిపదికన పోస్టులను రిజర్వు చేసింది. బోర్డు అధికారులు నోటిఫికేషన్ల విడుదల మొదలు పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళికలను రూపొందిస్తున్నారు.