హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదలచేసింది. గతంలో జీవో 58, 59 కింద ఉన్న నిబంధనలనే కొనసాగించింది. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద దరఖాస్తు చేసే సమయంలో ఫీజు రూ.వెయ్యి కడితే సరిపోతుందని పేర్కొన్నది. దరఖాస్తును తిరస్కరించినా.. ఈ డబ్బును వెనక్కి ఇవ్వరు (నాన్ రీఫండ్). దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. అంతకు మించి ఉంటే రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా చార్జీలు వసూలు చేస్తారు. చెల్లించాల్సిన మొత్తంలో కనీసం 12.5 శాతం దరఖాస్తు చేసే సమయంలో డిపాజిట్ చేయాలనే నిబంధన గతంలో ఉండేదని, ఇప్పుడు అవసరం లేదని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దరఖాస్తులు కచ్చితంగా మీసేవ కేంద్రంలోనే చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 31వ తేదీ తుది గడువు. ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆధార్ కార్డు, ఆక్రమిత స్థలంలో 2014 జూన్ 2కు ముందు నుంచే ఉంటున్నట్టుగా ధ్రువీకరణ పత్రం. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్, విద్యుత్తు బిల్లు, వాటర్ బిల్లు రిసిప్ట్, లేదా నివాసాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలు (నిర్మాణ అనుమతి పత్రాలు వంటివి)