హైదరాబాద్ : జీవో 58 క్రింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పట్టాలను వారం రోజుల్లోగా పంపిణీ చేసేలా పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కు సూచించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat)లోని కాన్ఫరెన్స్ హాల్ లో జీవో 58, 59లపై, ఆసరా పెన్షన్లు, దళిత బంధు ఇతర కార్యక్రమాల అమలు పై సమీక్ష నిర్వహించారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు , ఒంటరి మహిళలు గౌరవంగా బతకాలనే ఆలోచనతో ఆసరా పెన్షన్లను అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2.76 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెల రూ. 67 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం ఆగస్టు నుంచి 57 సంవత్సరాలు దాటిన వారికి కూడా నూతనంగా పెన్షన్ లను ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ఆదేశాల మేరకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
రెండో విడత దళితబంధు(Dalit Bandu) అమలుకు సంబంధించి ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకొనే వారికి ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు గృహ లక్ష్మి పథకం అమలుకు మార్గదర్శకాలు రానున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ(Home Minister Mahamood ali ) డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీ(MLC) లు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేంధర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బలాల,ముంతాజ్ అహ్మద్ ఖాన్, కలెక్టర్ అమయ్ కుమార్అధికారులు పాల్గొన్నారు.