హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు చెందిన యూజీ, పీజీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆ శాఖ జిల్లా అధికారులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అమెరికా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిల్యాండ్, సౌత్ కొరియాతో పాటు సింగపూర్ వంటి దేశాలలో చదువుకోవడానికి అర్హతలున్న వారు ఓవర్సిస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో (ఫాల్ సీజన్) అడ్మిషన్లు పొందిన వారు ఈ మేరకు దరఖాస్తులు చేసుకునే విధంగా మైనారిటీ విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జనవరి 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జనవరి 23 వరకు దరఖాస్తుల గడువు కొనసాగుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల ప్రతులను ఫిబ్రవరి నెలాఖరులోగా సంబంధించిన అధికారికి పంపుకోవడానికి గడువు విధించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ ఈపాస్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.