హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : మిల్లర్ల దగ్గర ధాన్యం నిల్వలు లేవని రాజకీయ నాయకులు అసమంజస వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేంద్ర, ప్రధానకార్యదర్శి వడ్డీ మోహన్రెడ్డిలు తప్పుబట్టారు. మిల్లర్లపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలనడాన్ని ఖండించారు. శుక్రవారం అసోసియేషన్ తరఫున వారు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది వరి పంట దిగుబడి పెరుగుతున్నదని, రైతుల ఒత్తిడికి తలొగ్గి మిల్లుల్లో వాస్తవ కెపాసిటీ కంటే 2-3 రెట్లు అధికంగా ధాన్యం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
ఆ తర్వాత రైస్ డెలివరీ చేయడానికి పడే ఇబ్బందులను పట్టించుకోకుండా తిరిగి రైస్ మిల్లులపై నిందలు మోపడం తగదన్నారు. సుమారు 980 బాయిల్డ్ మిల్లులను కోట్లాది రూపాయల అప్పులతో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి బాయిల్డ్ బియ్యం తీసుకోమనడం బాయిల్డ్ మిల్లులపై పిడుగు పడడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో జూన్ నుంచి నవంబర్ వరకు ఎఫ్సీఐ దగ్గర గోదాములలో ఖాళీ స్థలం లేక కొన్ని మిల్లుల్లో ఆరు బయట నిల్వ చేసిన ధాన్యం కొంత నష్టపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని వెల్లడించారు.
నష్టాలను ఓర్చుకొని రైస్ మిల్లులను నడిపితే మమ్మల్ని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించడం బాధాకరమని వాపోయారు. 2020-21లో రబీ, 2021-22 ఖరీఫ్నకు సంబంధించి సుమారు 45 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నదని, దీనిని త్వరగా ఎఫ్సీఐ తీసుకోవాలని కోరారు. రా రైస్ మాత్రమే పెట్టాలనే నిబంధనలు బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీ భవిష్యత్ను అగమ్యగోచరంగా మార్చాయని పేర్కొన్నారు. కనుక రాజకీయ నాయకులు తెలంగాణ రైస్ ఇండస్ట్రీ కృషిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3000 మంది మిల్లర్స్, లక్షలాది మంది కార్మికుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ప్రకటనలు చేయొద్దని వారు కోరారు.