ఒట్టావా, ఆగస్టు 13: కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో తాజాగా ఓ దేవాలయంలో ఖలిస్తానీలు విధ్వంసానికి దిగారు. ఇక్కడి లక్ష్మీనారాయణ ఆలయంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ‘జూన్ 18న హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై కెనడా విచారణ జరుపుతుంది’ అంటూ ఆలయం గోడలు, గేట్లపై పోస్టర్లను అతికించారు. మొహానికి మాస్కులు ధరించి వచ్చిన ఇద్దరు ఖలిస్తానీలు ఈ దాడికి తెగబడినట్టుగా తెలుస్తున్నది. పోస్టర్లు అతికిస్తూ దిగిన ఫొటోలను, వీడియోను దుండగులు సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. కెనడాలోని సుర్రేలో గురుద్వారా సాహెబ్ వద్ద నిజ్జర్ను జూన్ 18న ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. సిక్కు వేర్పాటువాద సంస్థ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్కు చీఫ్గా నిజ్జర్ పనిచేశాడు. ఈ మధ్యకాలంలో కెనడాలో హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ ఖలిస్తానీలు విధ్వంసానికి దిగటం అక్కడి భారతీయుల్లో ఆందోళనకు గురిచేస్తున్నది.