నల్లగొండ రూరల్, జనవరి 7 : బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. నల్లగొండ కేంద్రంలోని టీఆర్టీ భవన్లో శనివారం జరిగిన సంఘం జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణను చేస్తామన్న బీజేపీ.. మాదిగలను మోసం చేసిందని విమర్శించారు. అందుకే ఆ పార్టీకి బుద్ధిచెప్పడానికి ఈ నెల 9న కరీంనగర్లో సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
మాదిగ, మాదిగ ఉప కులాలకు విద్య, ఉద్యోగాల్లో సామాజిక న్యాయం జరగాలని అన్నారు. ఎస్సీ కులాలు రిజర్వేషన్ ఫలాలను సమానంగా పంచుకొని అభివృద్ధిలోకి రావాలని 28 ఏండ్లుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం చేస్తున్నా.. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతమున్న బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 9 ఏండ్లలో మాదిగలకు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు.