యాదగిరిగుట్ట, జనవరి 21 : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) ఫిబ్రవరి 19నుంచి 25వ తేదీ వరకు జరుపుతున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 15 నుంచి 18వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అధ్యయనోత్సవాల్లో భాగంగా పాతగుట్టలో భక్తులతో జరిపించే నిత్య కల్యాణం హోమాలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 22న రాత్రి 8గంటలకు నిర్వహించే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనేందుకు వీలుగా కల్యాణ టికెట్ను రూ.600గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి 8గంటలకు దివ్య విమాన రథోత్సవాన్ని పాతగుట్ట ఆలయం ముందు భాగం నుంచి స్వామివారి కల్యాణ మండపం వరకు ఊరేగిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 25న స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు పరిపూర్ణం అవుతాయని తెలిపారు.