పాలమూరు, ఫిబ్రవరి 11: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత, లిమ్కా, గిన్నిస్ వరల్డ్ రికార్డుల గ్రహీత, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి రచించిన ‘యాన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’ పుస్తకాన్ని మహబూబ్నగర్ జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనాథాచారి మాట్లాడుతూ.. 30 ఏండ్ల అనుభవం, మూడేండ్ల కఠోర దీక్షతో ఈ పుస్తకాన్ని రచించినట్టు తెలిపారు. పుస్తకం ధర రూ.5 కోట్లు అని, ఈ పుస్తకాన్ని అమ్మగా వచ్చిన డబ్బులలో ఐక్యరాజ్యసమితికి 50 శాతం, దేశానికి 25 శాతం, తెలంగాణకు 25 శాతం చెల్లిస్తానని తెలిపారు. ఇందులో పది విభాగాలుగా.. 197 దేశాల్లోని సమస్యలపై 237 కవితలు రాసినట్టు చెప్పారు.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకమని, త్వరలోనే దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. ఈ పుస్తకం గిన్నిస్ రికార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీనాథాచారిని మొమెంటో, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.