హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించి రాష్ట్రంలో పచ్చదనం మరింత పెంపొందించాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితనిధి ఏర్పాటుకు నిర్ణయించారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన శాసనమండలిలో హరితహారంపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం దేశ చరిత్రలోనే మొదటిసారిదని పేర్కొన్నారు. చెట్లు పెంచడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తకుండా, ప్రజలకు పచ్చదనంపై అవగాహన పెంచే లక్ష్యంతో హరితనిధిని ఏర్పాటుచేశారని చెప్పారు. హరితహారం కింద ఇప్పటివరకు 239.87 కోట్ల మొక్కలు నాటామని, రూ.6,555.97 కోట్లు ఖర్చుచేశామని వివరించారు.
ఆలయాల అభివృద్ధికి బాటలు
రాష్ట్రంలోని సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ నిధులు కేటాయిస్తూ, వాటి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో సభ్యులు పురాణం సతీశ్, బాలసాని లక్ష్మీనారాయణ, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్రావు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణస్వామి, గంగాపూర్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులపై అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బాసర సరస్వతీదేవి, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రూ.50 లక్షల వ్యయంతో గంగాపూర్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మండపం, విమాన గోపురం నిర్మిస్తామని పేర్కొన్నారు.