హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మైనింగ్ అండ్ జియాలజీ శాఖలో ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులు లేకపోతే రూ.లక్షన్నర, కేసులుంటే రూ.ఐదు లక్షల చొప్పున పుచ్చుకున్నారనే ఆరోపణలొస్తున్నాయి. బదిలీకి ఉండాల్సిన నిర్దిష్ట సర్వీసు లేకుండానే కొందరిని బదిలీచేశారని చెప్పుకొంటున్నారు. ఇదిలాఉంటే, ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో చిక్కుకున్న వారికి ఆయా కేసులు క్లియర్ కాకుండానే ప్రమోషన్లు ఇచ్చారని, ఫోకల్ స్థానాలను కట్టబెట్టారనే చర్చ నడుస్తున్నది. ఇదే అంశంపై కొందరు ప్రభుత్వానికీ, విజిలెన్స్ విభాగానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రమోషన్లు, పోస్టింగ్స్పై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై మైనింగ్ అండ్ జియాలజీ విభాగం కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్యామలరావును సంప్రదించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రయత్నించగా, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఓ పది మందిపై విజిలెన్స్ కేసులుండగా, 24 గంటల వ్యవధిలోనే డీపీసీ పూర్తిచేసి ప్రమోషన్లు ఇచ్చినట్టు శాఖలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. జూలై 9న డీపీసీ నిర్వహించి 14న ఉత్తర్వులిచ్చారు. ప్రమోషన్ల సీనియారిటీ జాబితా, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రమోషన్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఏసీబీ ట్రాప్ చేసిన ఓ ఉద్యోగికి ఫోకల్ పోస్టులో పోస్టింగ్ ఇచ్చారు. విజిలెన్స్ కేసులున్న వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు గతంలో ఓ ఉన్నతాధికారి ఫైల్ను తిరస్కరించారని, కానీ, ఇప్పుడు వారికే ప్రమోషన్లు ఇచ్చారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 2026 ఏప్రిల్లో డీపీసీకి ఫైల్ను పంపించగా, డీపీసీ కన్వీనర్ కమిటీని నిర్వహించకుండానే దానిని తిరస్కరించారు.
ఇదే ఫైల్ను మళ్లీ ఆమోదించడం, ప్రమోషన్లు ఇవ్వడం వెనుక భారీ తతంగం జరిగినట్టు సర్కార్కు సమర్పించిన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ శాఖలో ఓ అధికారి షాడోగా వ్యవహరిస్తున్నారని, మొత్తం శాఖను తన చేతుల్లోకి తీసుకొని నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో అయనదే కీలకపాత్ర అన్న ఆరోపణలున్నాయి. విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉండగానే ప్రమోషన్లు ఇవ్వడం మైనింగ్ శాఖ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. విజిలెన్స్ కేసులు ఉన్నప్పటికీ, కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్లకు రాయల్టీ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్లు ఇచ్చారని, ఫోకల్ పోస్టులు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. పైగా నాన్ ఫోకల్ ప్రాంతాలైన నారాయణపేట, వనపర్తిలో ఒక్కరిని కూడా నియమించలేదు. జోగుళాంబ గద్వాల, నిర్మల్ జిల్లాలను ఖాళీగా ఉంచారు. టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఆర్ఐగా ప్రమోషన్లు కల్పించిన వారిలో ఇద్దరిపై విజిలెన్స్ కేసులున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొందరు మహిళా అధికారుల సమ్మతి లేకుండానే విజిలెన్స్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ ఇద్దరు టెక్నికల్ స్టాఫ్ బదిలీలకు అర్హత లేకపోయినా హనుమకొండ నుంచి నిజామాబాద్కు, నిజామాబాద్లో ఉన్న వారిని హనుమకొండకు బదిలీచేశారని ఆరోపించారు. సిద్దిపేట నుంచి ఓ ఉద్యోగిని కరీంనగర్కు బదిలీచేశారు. సదరు ఉద్యోగిపై ఏసీబీ కేసు ఉన్నది. అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఏజీ)కు జనగామ నుంచి సంగారెడ్డికి ఫోకల్ పోస్టు ఇవ్వగా, జనగామలో ఒక్కరు కూడా లేరు. ఇదే జనగామలోని మూడు పోస్టులకు ముగ్గురిని బదిలీచేసి ఇద్దరిని మాత్రమే ఇచ్చారు. బదిలీకి మూడేండ్ల సర్వీస్ ఉండాలి. కానీ ఏడాదిన్నర, రెండేండ్ల సర్వీసు ఉన్నవారిని కూడా బదిలీలు చేశారు. బదిలీ కోసం దరఖాస్తు చేయని వారికి సైతం స్థానచలనం కల్పించినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు.