రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో వేసిన రైల్వేలైను పొడవు వంద కిలోమీటర్ల కన్నా తక్కువే. నత్తలు కూడా సిగ్గుపడేలా ఉన్న కేంద్రం పనితీరుకు ఎలాంటి అవార్డులు, బిరుదులు ఇవ్వాలో తెలియట్లే. బీజేపీ ఎంపీలు సోయి తెచ్చుకుని తెలంగాణ బిడ్డలుగా ఢిల్లీలో కొట్లాడేందుకు మాతో కలిసి రావాలి.
– కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఇదే ఆఖరు బడ్జెట్ అని, ఈసారైనా విభజన హామీల అమలుకు పూనుకోవాలని కోరారు. మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో తెలంగాణలో వేసిన రైల్వేలైన్ల పొడవు 100 కిలోమీటర్ల కంటే తక్కువేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో ఇటీవల చనిపోయిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గొల్లపల్లి కిషన్, దేవేందర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. వీర్నపల్లిలో కంటి వెలుగు వైద్యశిబిరాన్ని సందర్శించి, అక్కడి వైద్య సేవలపై ప్రజలను ఆరా తీశారు.
అనంతరం రంగంపేట గ్రామంలో దళితబంధు పథకం కింద కుమ్మరి దేవయ్య స్థాపించిన టిఫిన్ సెంటర్ను కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి సందర్శించి అల్పాహారం చేశారు. అక్కడి నుంచి వెంకటాపూర్ మండలం పోతిరెడ్డిపల్లెకు చేరుకుని బీఆర్ఎస్ నాయకుడు కనుకంట్ల బాలయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చింది. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కొత్త విద్యాసంస్థల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కేంద్రం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోడానికి మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇదే చివరి అవకాశం. కేంద్రానికి నిజాయితీ ఉంటే ఆఖరి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా’నని పేర్కొన్నారు.
‘తెలంగాణ నిధులను కేంద్రం తిన్నది. తెలంగాణ ప్రజల చెమట, రక్తం మీ వెనుకబడ్డ రాష్ర్టాలకు వాడుకున్నారు. తెలంగాణ నుంచి రూ.3,68,000 కోట్లు పన్నుల రూపంలో కడితే.. మీరు ఇచ్చింది రూ.1,68,000 కోట్లు మాత్రమే’నని స్పష్టంచేశారు. తొమ్మిదేండ్లలో బీజేపీ ఎంపీలు తెలంగాణకు నయా పైసా పని కూడా చేయలేదని, తాను చెప్పిన మాట తప్పయితే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. మోదీ హయాంలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు అధోగతి పాలయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క కొత్త రైల్వేలైను కానీ, ఒక్క ప్రాజెక్టును కానీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు.
గత ప్రభుత్వంలో మంజూరైన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైనును పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో వేసిన రైల్వేలైను పొడవు వంద కిలోమీటర్ల కన్నా తక్కువేనని, ఇంతకంటే సిగ్గుచేటు లేదని దుయ్యబట్టారు. నత్తలు కూడా సిగ్గుపడేలా ఉన్న కేంద్రం పనితీరుకు ఎలాంటి అవార్డులు, బిరుదులు ఇవ్వాలో తనకైతే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడం కాదని, సోయి తెచ్చుకుని తెలంగాణ బిడ్డలుగా ఢిల్లీలో కొట్లాడేందుకు తమతో కలిసి రావాలని హితవు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు మాదిరిగా పీఎం కిసాన్ పథకంలో ప్రతి రైతుకూ ఎకరా రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమలు ఏవీ?
హైదరాబాద్లో ఫార్మాసిటీ, వరంగల్ మెగా టెక్స్టైల్స్ పార్క్, సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ ఇవ్వాలని అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు నవోదయ విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలల ఊసే లేదని ధ్వజమెత్తారు. సీనియర్ సిటిజన్ల రైల్వేపాసులను సైతం ఎత్తివేశారని మండిపడ్డారు. వీటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో లింగంపల్లి-విజయవాడ కొత్త రైలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,904 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం శోచనీయమని చెప్పారు. దేశంలో బ్రిటిష్ కాలపు చిహ్నాలు, బానిస పోకడలు పోవాలని గొప్ప స్పీచ్లు ఇస్తున్న మోదీ.. గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్లు పెట్టిందేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చురకలేశారు. రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్లుగా నియమించొద్దన్న అంశాన్ని ప్రధాని పాటిస్తున్నారా? అని నిలదీశారు.
నాడు ముఖ్యమంత్రిగా నీతులు చెప్పిన మోదీ.. ప్రధానిగా వాటిని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు పార్టీల ప్రతినిధుల మాదిరిగా వ్యవహరించడం, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మార్చడం దేశానికి, వ్యవస్థకు మంచిది కాదని చెప్పారు. గవర్నర్లను ఎవరు ఎన్నుకున్నారని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు రెండేండ్లపాటు ఖాళీగా ఉంటేనే వారికి గవర్నర్ పదవులు ఇవ్వాలని సర్కారియా, పూంచ్ కమిషన్తో పాటు గతంలో సీఎంగా మోదీ స్వయాన చెప్పారన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పాల్గొన్నారు.
నేడు కమలాపూర్కు కేటీఆర్ రాక
మంత్రి కేటీఆర్ మంగళవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. కొత్త పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2 గంటలకు జమ్మికుంటకు వెళ్లి బహిరంగసభలో పాల్గొంటారు.
వివక్ష విడిచిపెట్టాలి
కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ పట్ల వివక్షను విడిచిపెట్టాలని, అటు ప్రయాణికులు, ఇటు సరుకు రవాణా డిమాండ్ మేరకు రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణపై ప్రేమ లేకున్నా కనీసం విభజన చట్టం హామీల మేరకు కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు 2023-24 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించడంతోపాటు తెలంగాణలో ప్రతిపాదించిన నూతన రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విన్వైష్ణవ్కు రాసిన లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
నేడు మోడ్రన్ గెస్ట్హౌస్కు ప్రారంభోత్సవం
కరీంనగర్లో ఆధునిక సౌకర్యాలు, సకల హంగులతో నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. సుమారు ఎకరం స్థలంలో రూ.12 కోట్ల వ్యయంతో సకల వసతులు, సౌకర్యాలు, పారింగ్ స్థలంతో అత్యంత సుందరంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ భవనానికి కరీంనగర్ సర్యూట్ రెస్ట్హౌస్ (కేసీఆర్ )గా ఇప్పటికే మంత్రి గంగుల నామకరణం చేశారు.