హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల ఆదాయం రెట్టింపైందే తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నమోదీ.. ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి, పంట పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేశారని విమర్శించారు.
ఎన్నికల హామీ ప్రకారం పంటలకు మద్దతు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. దేశంలో 53 రకాల పంటలు పండుతుంటే.. కేంద్రం 29 పంటలకే మద్దతు ధర ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. కేంద్రానికి వ్యవసాయ రంగంపై ఒక సమగ్ర విధానం గానీ, ప్రణాళిక గానీ లేదని దుయ్యబట్టారు.