కాశీబుగ్గ, మార్చి 15 : లంచం తీసుకుంటూ వ్యవసాయ మార్కెటింగ్ ఇన్చార్జి ఈఈ సిరాజ్ మోహినుద్దీన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా పరకాల మార్కెట్ కమిటీ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు, ఎస్టిమేషన్ విషయంలో హనుమకొండలోని భవానీనగర్కు చెందిన కాంట్రాక్టర్ కోడెల వెంకట శైలేంద్రను వరంగల్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో డీఈ (ఇన్చార్జి ఈఈ)గా పనిచేస్తున్న సిరాజ్ మోహినుద్దీన్ రూ.65 వేలు డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్ రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కూరగాయల మార్కెట్ సమీపంలో ఈఈ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి సిరాజ్ మోహినుద్దీన్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నగదుతోపాటు ఇన్చార్జి ఈఈని అదుపులోకి తీసుకున్నారు.