హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జలహక్కులకు గొడ్డలిపెట్టులాంటి ఏపీ ప్రతిపాదిత పోలవరం బనకచర్ల-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందా? ఇటీవల కర్ణాటకలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో మూడు రాష్ర్ర్టాల ముఖ్యమంత్రులు ప్రాజెక్టుపై ఏకాభిప్రాయానికి వచ్చారా? త్వరలోనే రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారా? అంటే అధికారవర్గాలు ‘అవును’ అనే అంటున్నాయి. ఏపీ, కర్ణాటక ప్రతిపాదనలకు తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపిందని విశ్వసనీయ సమాచారం. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను పోలవరం నుంచి తొలుత బనకచర్లకు, ప్రస్తుతం నల్లమలసాగర్కు తరలించేందుకు ఏపీ పోలవరం బనకచర్ల (నల్లమలసాగర్) లింకును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టు ముసుగులో గోదావరి-కావేరి (జీసీ) లింకు పేరిట దాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుపై ఆమోదం కోసం కర్ణాటక, తెలంగాణతో సంప్రదింపులు జరుపుతున్నది. తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణాటక ప్రస్తుతం ఏపీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని విశ్వసనీయ సమాచారం.
జీసీ లింకు ప్రాజెక్టు ద్వారా కర్ణాటకు వచ్చే 16 టీఎంసీల వాటాను ఆ రాష్ట్రం ఎగువనే వాడుకోవచ్చని ఏపీ ఇప్పటికే హామీనిచ్చింది. మరిన్ని తాయిలాలు కూడా కర్ణాటక సర్కార్కు అటు కేంద్రం, ఇటు ఏపీ ఇచ్చాయని తెలిసింది. తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఏపీ ప్రతిపాదించిన పీబీ లింకు ప్రాజెక్టుపై చర్చలు కొనసాగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కర్ణాటకకు బెడ్తి వరద లింకు ప్రాజెక్టును చేపట్టేందుకు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు, తుంగభద్ర డ్యామ్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరిట నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించేందుకు అయ్యే వ్యయంలో రూ.5 వేల కోట్ల ఆర్థిక అందించేందుకు కేంద్రం హామీనిచ్చినట్టు తెలిసింది. కర్ణాటక చేపట్టిన ఆయా ప్రాజెక్టుల పనులకు ఏపీ సైతం ఆమోదం తెలిపిందని సమాచారం. ట్రిబ్యునల్ తుంగభద్ర డ్యామ్కు కేటాయించిన 230 టీఎంసీల మేరకు మాత్రమే వినియోగించుకోవాలనే షరతుతో నావలి రిజర్వాయర్ను విస్తరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటకు అనుమతిచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీ చేపట్టిన పీబీ లింకు ప్రాజెక్టుకు కర్ణాటక సైతం ఎన్వోసీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. సమావేశం అనంతరం సభలో డీకే శివకుమార్ మాట్లాడుతూ నావలి రిజర్వాయర్పై త్వరలోనే కేంద్రం తీపికబురు అందిస్తుందని ప్రకటించడం ఇందుకు బలాన్నిస్తున్నది. మొత్తంగా ఏపీ, కర్ణాటక పరస్పరం కుమ్మక్కయ్యారని తేలిపోయింది. ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలపై త్వరలోనే రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవాలని కూడా ఈ భేటీలోనే నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
రేవంత్రెడ్డి అడిగిందీ లేదు.. అడ్డుకున్నదీ లేదు..
‘కేంద్ర జల్శక్తి శాఖను రాష్ర్టానికి సంబంధించిన జలహక్కులపై నిలదీస్తాం. నిధులివ్వాలని కోరుతాం. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తే సమావేశాన్ని బాయ్కాట్ చేస్తాం. ఎజెండాలో నుంచే తొలగించాలి. అప్పుడే సమావేశానికి హాజరవుతాం’ అంటూ గతంలో ప్రగల్భాలు పలికి, అందుకు భిన్నంగా చర్చలో పాల్గొని, ప్రాజెక్టుపై కమిటీ ఏర్పాటుకు అంగీకరించి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఈ సారీ అదే తరహాలో వ్యవహరించారని తెలిసింది. ముగ్గురు సీఎంల భేటీలో వేటినీ అడుగకుండానే, తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులాంటి కర్ణాటక, ఏపీ ప్రతిపాదనలకు సై అన్నారని విశ్వసనీయంగా తెలిసింది. కర్ణాటక చేపడుతున్న నావలి రిజర్వాయర్, ఆర్డీఎస్ ఎగువ, దిగువన చేపడుతున్న చిక్కాలమంచి, చిక్కాలపర్వి బరాజ్లతో తెలంగాణకు తీరని ముప్పు పొంచి ఉన్నది. కొడంగల్ లిఫ్ట్ కోసం కర్ణాటక బరాజ్లకు ఇప్పటికే గుట్టుగా అనుమతులిచ్చిన రేవంత్ సర్కార్ తాజాగా అలాంటి మోసానికే పాల్పడినట్టు తెలుస్తున్నది. వాస్తవంగా సమావేశానికి ముందు కర్ణాటక ప్రాజెక్టులు, ఏపీ ప్రతిపాదనలతో తెలంగాణకు వాటిల్లే ప్రమాదాన్ని వివరిస్తూ, వాటిపై ఆయా రాష్ర్టాలు ముందుకు పోకుండా నిలువరించాలని కోరుతూ తెలంగాణ అధికారులు నోట్స్ తయారు చేశారు.
కేంద్రానికి ఫిర్యాదు చేసేలా లేఖలు సిద్ధం చేశారు. కానీ ఆ భేటీలో అధికారులెవరినీ, ఆఖరుకు మంత్రిని సైతం అనుమతించలేదు. ముఖ్యమంత్రి ఒక్కరే కేంద్రమంత్రి, ఆయా రాష్ట్రాల సీఎంలతో భేటీ అయి చర్చించారు. బనకచర్లకు అనుమతిచ్చేందుకు సైతం సుముఖత వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. ఇదే విషయమై ఇప్పుడు ఇరిగేషన్వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. 40 నిమిషాలపాటు కొనసాగిన ఆ భేటీలో తెలంగాణ జలవివాదాలకు సంబంధించి ఏ అంశాన్ని కూడా రేవంత్రెడ్డి ప్రస్తావించలేదని తెలిసింది. ఆయా రాష్ర్టాల ప్రతిపాదనలకు తలూపడం తప్ప చేసిందేమీ లేదని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. భేటీ అనంతరం సభలో రేవంత్రెడ్డి సైతం మాట్లాడుతూ చారిత్రాత్మక ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. కానీ ఇంతవరకు ఏ అంశాలపై ఒప్పందాలు జరిగాయనేది బయటపెట్టలేదు. మొత్తంగా తెలంగాణ ప్రయోజనాలకు తీరని విద్రోహాన్ని రేవంత్ సర్కార్ తలపెట్టిందని అధికారవర్గాలే రగిలిపోతున్నాయి.