హైదరాబాద్ : గతంలో జారీ చేసిన పాత నోటిఫికేషన్లకు ఏజెన్సీ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ పోస్టులను వందకు వందశాతం ఏజెన్సీ వారితోనే భర్తీచేయనున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు ముందే ఈ నోటిఫికేషన్లు జారీకావడంతో నోటిఫికేషన్లో పొందుపరిచిన మార్గదర్శకాలను అమలుచేయనున్నారు. టీఆర్టీ 2017లో భాగంగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్నింటి ఫలితాలు వెల్లడించి, నియామకాలు పూర్తికాగా, కోర్టు కేసుల కారణంగా మరికొన్నింటి నియామకపు ప్రక్రియ కొసాగుతున్నది.
గతంలో జీవో -3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని పోస్టులను 100శాతం ఏజెన్సీ వారితోనే భర్తీచేసేవారు. 2020 ఏప్రిల్లో దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరగగా, ఏజెన్సీ ప్రాంతాల్లోని పోస్టులు 100శాతం వారికే ఇవ్వడం సరికాదని, ఈ కోటా 50 శాతానికి మించవద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పుననుసరించి పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లల్లో సైతం సుప్రీం కోర్టు తీర్పును అమలుచేయాలని, 50 శాతం పోస్టులను తమకు కేటాయిచాలని, కొంత మంది జనరల్ కేటగిరి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారి వాదనను తిరస్కరించి, పాత నోటిఫికేషన్లకు సుప్రీం కోర్టు తీర్పు వర్తించదని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని 159 టీచర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. కీలకమైన అడ్డంకి తొలగడంతో ఫలితాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులిచ్చేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.