హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థుల సౌకర్యం కోసం ఇంజినీరింగ్ కాలేజీ అఫిలియేషన్లపై జేఎన్టీయూ కసరత్తు కొనసాగుతున్నది. అందులో భాగంగా గురువారం 123 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాలను ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్కు పంపినట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుసేన్ తెలిపారు. 123 కాలేజీలలో కలిపి దాదాపు 80 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చాయని, వాటిని ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడానికి వీలుంటుందని అన్నారు.
ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలోనే దాదాపు 40 శాతం వరకు అందుబాటులోకి వచ్చాయని, మార్కెట్ డిమాండ్, విద్యార్థుల ఆసక్తిని బట్టి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఈ కోర్సుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. అలాగే త్వరలో మరో ఏడు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. అయితే కొన్ని కాలేజీల్లో నియామకాల ఖాళీల వల్ల వాటికి మరో అవకాశం ఇచ్చేందుకు ఒకటి రెండు రోజులు అఫిలియేషన్ పెండింగ్లో పెట్టినట్టు హుసేన్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆయా కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వడానికి యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నదని అన్నారు. మరో నాలుగు వేల వరకు సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.