హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విభాగంలో ప్రమోషన్ల ప్రక్రియను వైద్యారోగ్యశాఖ ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే 30 మంది ప్రొఫెసర్లకు అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతులు రానున్నాయి. తాజాగా అర్హుల జాబితా ప్రకటించడం పట్ల వైద్యారోగ్య సంఘాలు హర్షం ప్రకటించాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పటిష్టతకు పెద్దమొత్తంలో సిబ్బంది భర్తీ, ప్రమోషన్ల ప్రక్రియలను వేగిరం చేశారని, ఆయనకు రుణపడి ఉంటామని తెలంగాణ మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేశ్, కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ బీ వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.