హైదరాబాద్ : రాష్ట్రంలో పదేండ్లుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు , సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం అధికారులు , డాక్యుమెంటరీ ఏజెన్సీ సిబ్బంది తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video Conference)లో మంత్రి మాట్లాడారు.
జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే 21 రోజుల దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) భాగంగా అంగన్ వాడీలు, మహిళా సమాఖ్యల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే దీటుగా రాణిస్తున్నారని అన్నారు.
మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ టీమ్(She teams), సఖి, భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసామని ఆమె తెలిపారు.అంగన్వాడీ(Anganwadi)ల ద్వారా గర్భిణులు , బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, దశాబ్ది ఉత్సవాలలో గ్రామీణ స్థాయి నుంచి ఈ అంశాలను ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీ కెరీ, డాక్యుమెంటరీ ఏజెన్సీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.