పరకాల, మార్చి 11: ఆలోచనలే ఆవిష్కరణలకు మూలమన్న శాస్త్రీయ దృక్పథాన్ని నిజం చేస్తున్నాడు ఓ యువకుడు. విజయానికి చదువే ముఖ్యం కాదని, గొప్పగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. చదువుకున్నది 10వ తరగతే అయినా.. ఆలోచనలకు పదును పెట్టి వ్యవసాయ పనిముట్లు ఆవిష్కరించి రైతులకు మేలు చేస్తున్నాడు. ఏటా రూ.3 కోట్ల విలువ చేసే 500లకు పైగా మినీ కల్టివేటర్లను తయారు చేసి దేశంలోని పలు రాష్ర్టాల రైతులకు అందించాడు. తనతోపాటు మరో 12 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాధారణ మెకానిక్ స్థాయి నుంచి ఆవిష్కర్తగా ఎదిగి రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటికే మూడు రకాల వ్యవసాయ పనిముట్లను ఆవిష్కరించి అన్నదాతలకు పనిభారాన్ని తగ్గిస్తున్నాడు. ఆ యువకుడే హనుమకొండ జిల్లా పరకాల విలీన గ్రామం సీతారాంపురానికి చెందిన కడివెండి మహిపాల్చారి.
1997లో 10వ తరగతి పూర్తి చేసిన మహిపాల్చారి.. కొన్నేండ్ల పాటు మెకానిక్ షాపు నడిపాడు. నష్టం రావటంతో తనకున్న ఎకరం భూమిలో సాగు చేశాడు. వరుస వర్షాలతో సాగులో కూలీల కొరత ఎక్కువై కలుపు తీయడం కష్టంగా మారింది. దీంతో పత్తి, మిరప పంటల్లో కూలీల అవసరం లేకుండా కలుపు తీసే మినీ కల్టివేటర్ను తయారు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అవార్డు అందుకున్నాడు. 2016లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏఆర్ఐ ప్రదర్శనలో, 2018లో జాతీయ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు కూడా స్వీకరించాడు. పవర్ వీడర్, సిట్టింగ్ కల్టివేటర్లను కూడా తయారు చేశాడు. హైడ్రాలిక్ ట్రాక్టర్తో పాటు మినీ త్రీ వీల్ ట్రాక్టర్ను రూపొందించాడు. త్రీ వీల్ ట్రాక్టర్ హ్యాండిల్తో పని చేయడం వల్ల ఎలాంటి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. గ్రామాల్లో ఎక్కువ బరువులు ఎత్తేందుకు హైడ్రాలిక్ ట్రాక్టర్ను తయారు చేశాడు. దీంతో సుమారు 500 కిలోల బరువు వరకు ఎత్తవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల రైతులకు మినీ కల్టివేటర్లను అందించాడు. 2019 డిసెంబర్లో 4 మినీ కల్టివేటర్లను చైనాకు ఎగుమతి చేశాడు. కల్టివేటర్లను రూ.45 వేల నుంచి రూ.50 వేలకే విక్రయిస్తున్నాడు.
రైతులకు కూలీల కొరతను తీర్చడంతోపాటు వారికి పని భారం తగ్గించాలని పనిముట్లను తయారు చేస్తున్నా. మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు నా కృషిని కొనసాగిస్తా. ప్రతిభకు చదువు ఒక్కటే ముఖ్యం కాదు. ఆలోచించి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.
– కడివెండి మహిపాల్చారి,
సీతారాంపురం, పరకాల