నిజామాబాద్: అతడి వయసు నిండా రెండు పదులు మాత్రమే. వైద్యవిద్యను అభ్యసిస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తికానుంది. ఇంతలో ఏమైందో ఏమో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఆ యువకుడిని కడసారి చూసేందుకు బంధుమిత్రులతోపాటు అతని దోస్తులు కూడా భారీగా తరలివెళ్లారు. అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగి వెళ్తూ అతని స్నేహితుల్లో ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాలో మెడిసిన్ చదువుతున్న దాసరి హర్ష (22) గత శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో ఆయన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం హర్ష బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన మిత్రులు తిరిగి తమ ఇళ్లకు వెళ్తుండగా మరో ఘోరం జరిగింది.
హర్షను ఆఖరిసారి చూసేందుకు వెళ్లిన దాసరి తరుణ్ (21) అనే యువకుడు తిరిగి వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్పై వెళ్తున్న ఆయనను ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులిద్దరూ ఒక్క రోజు వ్యవధిలోనే ఒకరు ఆత్మహత్య చేసుకుని, ఇంకొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేస్తున్నది.