హాలియా, నవంబర్ 21 : ఎకరం పొలం, పింఛన్ కోసం ఓ మహిళ తన కుమారుడు, మరొకరి సాయంతో భర్తను హత్య చేసింది. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. సోమవారం నల్లగొండ జిల్లా హాలియా పోలీస్స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర్రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్య (55) ప్రస్తుతం అనుముల మండలం పులిమామిడిలోని తన అత్తగారి ఇంటి వద్ద కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఆయనకు భార్య సుగుణమ్మ, కుమారుడు కోటేశ్ ఉన్నారు. వెంకటయ్యకు చిన్నగూడెంలో ఎకరం పొలం ఉన్నది. దాన్ని అమ్మాలని భార్య ఎంత చెప్పినా వినలేదు.
దాంతో వెంకటయ్యను హత్య చేస్తే పొలంతోపాటు వితంతు పింఛన్ వస్తదని తల్లీకొడుకు భావించారు. ఇందుకు పక్క గ్రామానికి చెందిన అనుముల మహేశ్తో లక్ష రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 14న వెంకటయ్యకు మహేశ్, కోటేశ్ మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటయ్య మెడకు టవల్ బిగించి హత్య చేశారు. కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి చిన్న అనుములకు వెళ్లే దారిలో పడేశారు. సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన భార్య, కుమారుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా హత్య విషయం బయటపడింది. హత్యకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు డీఎస్పీ తెలిపారు.