హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని వారసురాలిగా నకిలీ భార్యను సృష్టించి రూ.కోట్ల విలువై ప్లాట్ కాజేసేందుకు ల్యాండ్ మాఫియా పన్నిన కుట్ర రాజేంద్రనగర్ సబ్రిజిస్టార్ అప్రమత్తతతో బయటపడింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ముఠా కదలికలను అనుమానించి, ఆ రిజిస్ట్రేషన్ను పెండింగ్లో పెట్టి, డాక్యుమెంట్లలో ఉన్న చిరునామాకు లేఖ రాయడంతో అసలు విషయం తెలిసింది.
బాధితుల వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మునలూరుకు చెందిన చెరుకూరి శ్రీనివాసరావు 1998నుంచి అమెరికాలో కుటుంబంతో నివాసముంటున్నారు. 2000లో రాజేంద్రనగర్ బుద్వేల్లో జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫేస్-2లో 400 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాంతం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోకి రావడంతో గజం రూ.60 వేలకుపైగానే పలుకుతున్నది. ఈ భూమిపై కన్నేసిన కబ్జారాయుళ్లు ప్లాట్ వివరాలు సేకరించి, 2009లో శ్రీనివాస్రావు మృతిచెందినట్టు మీసేవ ద్వారా దరఖాస్తు చేశారు. 2010లోనే రికార్డుల్లో ఎక్కినట్టు నార్సింగి మున్సిపాలిటీ ద్వారా మరణ ధ్రువీకరణ పత్రాన్ని గత మార్చిలో సేకరించారు. మృతుడికి భార్య కృష్ణవేణి అని ఒక నకిలీ భార్యను సృష్టించి, ఆధార్ తయారుచేశారు. ఆమె ప్లాట్ను విక్రయించే అర్హత కలిగినట్టు డాక్యుమెంట్లు తయారుచేసి ఈ నెల 8న రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. అనుమానం వచ్చిన సబ్రిజిస్ట్రార్ ఆమెను ఎందుకు టెన్షన్గా ఉన్నారు? మీ భర్త ఎప్పుడు చనిపోయారు? అని ప్రశ్నించారు.
ఒకసారి 5 నెలల క్రితం అని, మరోసారి ఐదేండ్లు, ఇంకోసారి ఎనిమిదేండ్లు అంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో రిజిస్ట్రేషన్ను హోల్డ్లో పెట్టి 30న రిజిస్ట్రేషన్ చేస్తానంటూ వాళ్లను పంపించేశారు. లింక్ డాక్యుమెంట్లలో ఉన్న చిరునామా మునలూరుకు సబ్ రిజిస్ట్రార్ లేఖ రాసి రిజిస్ట్రేషన్ సంగతి తెలిపారు. తన ముందు 29న హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. విషయం తెలిసిన శ్రీనివాస్రావు.. తాను బతికే ఉన్నానని, వెంటనే తన బంధువులు డాక్యుమెంట్లు అందిస్తారని సమాచారం ఇచ్చారు. సోమవారం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో హాజరయ్యేందుకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సబ్రిజిస్ట్రార్తో మాట్లాడి ముఠాపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అధికారి అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలియజేశారు.