సదాశివనగర్, సెప్టెంబర్ 12: ప్రమాదవశాత్తు కల్వర్టులో పడి ఆర్మీ జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని లింగంపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన మున్నూర్ అరుణ్కుమార్ (23) పంజాబ్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల సెలవుపై ఈ నెల 4న ఇంటికి వచ్చాడు. ఆదివారం గ్రామం లో వినాయక నిమజ్జనం ఉండటంతో భోజనం చేసిన అనంతరం రాత్రి 9 గం టల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లాడు. రాత్రి 12 గంటలు దాటినా అరుణ్కుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అరుణ్ కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం గ్రామ ఉప సర్పంచ్.. జవాన్ తండ్రి సిద్ధిరాములకు ఫోన్ చేసి భూంపల్లి శివారులోని సొసైటీ గోదాం ముందు కల్వర్టులో పడి అరుణకుమార్ మృతి చెందినట్టు చెప్పారు. కల్వర్టులో పడిన అరుణ్కుమార్ తలకు బలమైన గాయాలు కావడం.. రాత్రి సమయంలో ఎవరూ చూడకపోవడంతో మృతి చెందాడు. తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.