సికింద్రాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 16: ఓ దంపతుల మధ్య తలెత్తిన కలహాలు మొత్తం కుటుంబాన్నే బలి తీసుకున్నాయి. భార్య, నాలుగేండ్ల బిడ్డతోపాటు కన్నతల్లికి విషమిచ్చిన కుటుంబ యజమాని తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ తార్నాకలో చోటుచేసుకున్నది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన ప్రతాప్ (34), సింధూర (32) కు ఎనిమిదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆద్య (4) అనే కూతురు ఉన్నది. చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ షోరూమ్లో డిజైనర్ మేనేజర్గా ప్రతాప్ పనిచేస్తున్నారు. సింధూర, ఆద్య, ప్రతాప్ తల్లి రాజాత్తి (69) తార్నాకలోని రూపాలి అపార్టుమెంట్లోని ఓ ఫ్లాట్లో నివాసముంటున్నారు. హిమాయత్నగర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో సింధూర మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతాప్ చెన్నైలోనే ఉంటూ వీకెండ్స్లో కుటుంబం వద్దకు వచ్చి వెళ్తుంటారు.
ఆదివారం బయటకు వెళ్లిన ప్రతాప్ దంపతులు.. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం వరకు కూడా సింధూర బ్యాంకుకు వెళ్లకపోవడం, అత్యవసరమైన పనుల నిమిత్తం బ్యాంక్ నుంచి కాల్ చేసినా స్పందించ లేదు. బ్యాంక్ ఉద్యోగి సింధూర ఇంటికి వచ్చి తలుపు తట్టినా స్పందన రాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు తెరిచిచూడగా, ప్రతాప్ ముందు హాలులో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ, ఒక బెడ్రూమ్లో సింధూర, ఆమె కూతురు ఆద్య, మరో బెడ్రూమ్లో ప్రతాప్ తల్లి విగత జీవులుగా కనిపించారు. కొనఊపిరితో ఉన్న సింధూరను గాంధీ దవాఖానకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.
చెన్నైకి రావాలనే విషయంతో గొడవలు
సింధూర హైదరాబాద్లో ఉద్యోగం చేయడం ప్రతాప్కు ఇష్టం లేదని, చెన్నైకి రావాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రతాప్.. సంక్రాంతి సందర్భంగా ఆదివారం రాత్రి వరకు తార్నాకలోని సింధూర తల్లిదండ్రులు, ఇతర బంధువుల వద్ద, కొంత సమయం గడిపారని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.