హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లో కార్ డెకార్స్, స్పోర్ట్స్ మెటీరియల్ విక్రయించే దక్కన్ భవంతిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు. అయితే, అగ్నికి ఆహుతయ్యరనే అనుమానాలు వ్యక్తముతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 12 గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేటలో ఉన్న ఆరు అంతస్థుల భవనంలో డెక్కన్ కార్పొరేట్, డెక్కన్ నైట్ వేర్ దుకాణాలు జావీద్ సోదరులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సెల్లార్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకొని వేగంగా భవనంపై అంతస్థులకు వ్యాపించాయి.
అధికారులు వెంటనే స్పందించి మంటలు అగ్నిమాపక యంత్రాలను అక్కడకు రప్పించారు. 22 ఫైరింజన్లు, దాదాపు 90 వాటర్ ట్యాంకర్లను మంటలు ఆర్పడానికి ఉపయోగించారు. భవనం మొదటి నాలుగు అంతస్థులను స్పోర్ట్స్ మెటీరియల్ గోడౌన్గా వాడుతున్నారు. ఐదు, ఆరు అంతస్థుల్లో ఇంటీరియర్ డెకరేషన్, సివిల్ పనులు జరుగుతున్నాయి. నాలుగో అంతస్థు వరకు భారీ ఎత్తున బట్టలు, సీట్ల కవర్లకు సంబంధించిన ముడి సరుకు నిల్వ ఉన్నది. రంగులు, బట్టలు, రెక్సిన్, సింథటిక్, కెమికల్, ప్లాస్టిక్ మంటలను వ్యాప్తిచేసే స్వభావమున్న వస్తువులు భారీఎత్తున నిల్వ ఉండటంతో మంటలు త్వరగా చెలరేగాయి.
భవనం చుట్టుపక్కల కూడా మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలు అలుముకోవడంతోపాటు భవనం దెబ్బతిని బీటలు వారింది. భవనం పరిసరాల్లో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. భవనం ఐదో అంతస్థులో ఉన్న నలుగురిని అగ్నిమాపకశాఖ అధికారులు సురక్షితంగా కాపాడారు. ఈ రెస్క్యూ అపరేషన్లో ఫైర్ అధికారి ధనుంజయ్రెడ్డి, డ్రైవర్ నర్సింగ్రావు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. ఘటన స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి రెస్క్యూ ఆపరేషన్ను దగ్గరుండి పర్యవేక్షించారు. పోలీస్, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, వాటర్ వర్క్స్ శాఖల సమన్వయంతో 90 మంది సిబ్బంది మంటలు అర్పివేసినట్టు రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య తెలిపారు.