హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో ప్రతి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. తొమ్మిదేండ్లలో వాస్తవాలు, గణాంకాలతో సహా సాధించిన విజయాలపై రాష్ట్రస్థాయిలో ప్రతి శాఖ డాక్యుమెంటరీలు రూ పొందించాలని సూచించారు. ముఖ్యమైన స్మారక చిహ్నాలు, భవనాలను విద్యుత్తుదీపాలతో అలంకరించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై ఆదివారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారి సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుగనున్నాయి. రాష్ట్రస్థాయిలో జరిగే కార్యక్రమాలతో పాటు జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయిల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పలు సబ్కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి నిర్మల, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కే అశోక్రెడ్డి, డైరెక్టర్ బీ రాజమౌళి, సాంస్కృతికశాఖ డైరెక్టర్ ఎం హరికృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.