హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతున్నది. చేతల వద్దకు వచ్చేసరికి స్తబ్దుగా ఉంటున్నది. ప్రభుత్వమే కాదు.. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుకూడా అలాగే ఉన్నది. భేష్.. మీరు బాగా పనిచేస్తున్నారు అంటూ ప్రశంసించినవారే.. తాము విడుదల చేయాల్సిన రుణం వద్దకు వచ్చేసరికి మొఖం చాటేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ విద్యుత్తు సంస్థల విషయంలో అటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్)ల మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో దాదాపు 3 నెలలుగా మన రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు రుణం కింద విడుదల చేయాల్సిన సుమారు రూ.400 కోట్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నాయి.
తాజాగా తెలంగాణ ట్రాన్స్కో ప్రదర్శిస్తున్న అత్యుత్తమ పనితీరు, ఆర్థిక రుణ క్రమశిక్షణ తదితర అంశాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీఎఫ్సీ.. శభాష్ అంటూ ప్రశంసించింది. ట్రాన్స్కోకు ఏ+ క్యాటగిరీని కేటాయించింది. అయితే అదే పీఎఫ్సీ, మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీలు కలిసి ఏప్రిల్లో విడుదల చేయాల్సిన సుమారు రూ.400 కోట్ల గురించి మాత్రం ఒక్క మాటకూడా చెప్పడం లేదు. నిజానికి పీఎఫ్సీ, ఆర్ఈసీలు గతంలోనే తెలంగాణ విద్యుత్తు సంస్థలతో చేసుకున్న రుణ ఒప్పందం మేరకు ఈ ఏప్రిల్లో రూ.400 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉన్నది. కానీ దాదాపు 3 నెలల కాలం దగ్గరికి వస్తున్నా.. ఈ రుణం విషయంలో ఉలుకూ, పలుకూ లేదు. ఇస్తామన్న రుణాన్ని సరైన సమయంలో విడుదల చేస్తేనే.. యాదాద్రి, భద్రాద్రి లాంటి థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం సాధ్యమవుతుంది. కేంద్ర సంస్థలు మాటలకే పరిమితమై.. చేతలకు వచ్చేసరికి తెల్లమొఖం వేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది.