పెద్దపల్లి, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: ‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి పరిస్థితిని తెచ్చింది. నమ్మి ఓట్లు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో 36 గంటల రైతు నిరసన దీక్ష శనివారం ప్రారంభమైంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్తో కలిసి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసానికి ఎలాంటి కష్టాలుండేవో రేవంత్ సర్కార్ వచ్చినంక మళ్లీ అవే వచ్చాయని, సాగు బాటలో ఉండాల్సిన రైతులు రోడ్ల మీదికి వచ్చి నీటి కోసం, కరెంటు కోసం ఆందోళన బాట పడుతున్నారని తెలిపారు. కాలువల్లో నీళ్లు రాక రైతు కన్నీరు కారుస్తుంటే ఈ సర్కారు ఏ మాత్రం చలించకుండా.. మొద్దు నిద్రపోతున్నదని మండిపడ్డారు. సాగు నీరందక ఎండిన పంటల రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని, రైతులను ఆదుకునే వరకు వారికి బీఆర్ఎస్ మద్దతుగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
గత పదేండ్లుగా బీఆర్ఎస్ సర్కార్ రైతులకు, ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నదని, కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన వంద రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన దరిద్రం మళ్లీ వచ్చిందని మండిపడ్డారు. రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలని, మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్ను తట్టి లేపి రైతులకు న్యాయం జరగాలనే 36 గంటల రైతు నిరసన దీక్ష చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల ఎకరాల పంట పొలాలు సాగు నీరందక ఎండిపోయాయని అన్నారు. ఎండిన పంటను తగులబెట్టడం, పశువులను మేపుతూ రైతులు బోరున విలపిస్తున్నా రేవంత్ సర్కార్ మనసు కరగడం లేదని, కనీసం ఎండిపోతున్న పంటల సర్వే సైతం చేపట్టడం లేదని విమర్శించారు. ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం పూర్తికాలం నిలువదని, రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందని అన్నారు. పాలన చేతగాక ఇతర పార్టీల మీద విమర్శలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఝూటా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్కు ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రైతులను రాజును చేయడమే లక్ష్యంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి బీడు భూములకు సాగు నీరందించిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.