హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు కరోనా బారినపడితే.. ఇంట్లో ఎవరూలేని పిల్లల సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా చైల్డ్ హెల్ప్లైన్ ఏర్పాటుచేశామని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ పిల్లల ఆలనాపాలన కోసం జిల్లాకేంద్రాల్లో ఏర్పాటుచేసిన ట్రాన్సి ట్ హోమ్స్కు తరలించి, వారి బాధ్యతలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వ కల్పించిన వాహన సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. శుక్రవారం ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఫీవర్ సర్వే నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కోరారు.