హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): 90శాతం మంది మహిళల్లో విటమిన్-డీ లోపం ఉన్నట్టు అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గృహిణులకు 30 మిల్లీగ్రాముల కంటే తక్కువ పరిమాణంలో విటమిన్-డీ మాత్రమే అందుతున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా నగరాల్లో నివసించే మహిళల్లో 80 శాతం మందిలో విటమిన్ డీ లోపాన్ని గుర్తించారు.
సూర్యరశ్మితో విటమిన్-డీ
కేవలం 40 శాతం సూర్మరశ్మి పడినా శరీరానికి కావాల్సినంత పరిమాణంలో విటమిన్-డీ ఉత్పత్తి అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. మహిళలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపు కనీసం 20-30 నిమిషాలపాటు సూర్యరశ్మి తమ శరీరంపై పడేలా చూసుకోవాలని సూచించారు. లేకపోతే వయసు పెరిగేకొద్దీ వచ్చే ఎముకలు గుల్లబారిపోవడం, ఒంటి నొప్పుల సమస్యలు మరింత జఠిలంగా మారుతాయన్నారు. కృత్రిమంగా దొరికే సప్లిమెంట్ల కంటే విటమిన్-డీ పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకుంటే లోపాన్ని సరిచేసుకోవచ్చన్నారు. ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, తరచుగా పుట్టగొడుగులు తీసుకుంటూ శరీరంపై సూర్మరశ్మి పడేలా జాగ్రత్తలు వహించడం వలన విటమిన్ డీ లోపాన్ని క్రమంగా తొలగించుకోవచ్చని చేసుకోవచ్చని సూచించారు.