
హైదరాబాద్ లో భిక్షాటన చేసే చిన్నారులను మనం చాలాసార్లు రోడ్ల మీద చూసి ఉంటాం. కానీ.. వాళ్లు అసలు.. రోడ్డు మీదికి ఎలా వచ్చారు? ఎందుకు భిక్షాటన చేస్తున్నారు? వాళ్లకు తల్లిదండ్రులు లేరా? వాళ్లతో భిక్షాటన చేయిస్తోంది ఎవరు? లాంటి సందేహాలు మనకు రావు కానీ.. హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల ఇలా భిక్షాటన చేస్తున్న పిల్లలకు విముక్తి కలిగించడం కోసం హైదరాబాద్ పోలీసులతో కలిసి వుమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (డబ్ల్యూసీడీ) డిపార్ట్ మెంట్ ఇటీవల ఒక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. పది రోజుల పాటు నిర్వహించిన ఈ డ్రైవ్ లో పలువురు చిన్నారులను సేవ్ చేయడంతో పాటు.. పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న రాకెట్ ను కూడా ఛేదించారు పోలీసులు.
హైదరాబాద్ లో మాకు తెలిసిన లెక్కల ప్రకారం 30 వేల మంది భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్టు తెలిసింది. అయితే.. చాలామందిని పెద్ద పెద్ద నగరాలకు పంపించి భిక్షాటన చేయిస్తుంటాయి కొన్ని ముఠాలు. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు చాలామంది హైదరాబాద్ కు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. కరోనా మహమ్మారి కూడా భిక్షాటన చేసే వాళ్ల సంఖ్యను పెంచింది. ముఖ్యంగా పిల్లలను ఈ రొంపిలోకి దింపేది ముఠాలే.. అందుకే.. పిల్లలను అయినా కనీసం కాపాడి.. వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించడం కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాం.. అని చెప్పారు జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ అక్కేశ్వర్ రావు.
ఈ డ్రైవ్ లో కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన 83 మంది చిన్నారులను గుర్తించి.. వాళ్లను కాపాడి డీఎన్ఏ చెక్ చేసి వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. భిక్షాటన చేస్తున్న పిల్లల్లో 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. వాళ్లను ఆ రొంపి నుంచి కాపాడి.. పిల్లలను వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించేముందు.. పిల్లలకు, తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే.. పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న ముఠాను పట్టుకొని వాళ్లపై కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ పోలీసులతో కలిసి ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సహకరించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, డబ్ల్యూసీడీ తెలంగాణ డిపార్ట్ మెంట్ అధికారులను, హైదరాబాద్ పోలీసులను తెలంగాణ సీఎంఓ కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
Kudos to the team effort of @SwetaMohantyIAS @WCDTelangana @hydcitypolice that led to Rescue of 83 children from Gulbarga who were being used for begging in Hyderabad city. The kids have been safely returned to their parents, after DNA check and counseling. pic.twitter.com/Bdc5hfw1CR
— Smita Sabharwal (@SmitaSabharwal) July 28, 2021