గుమ్మడిదల, జనవరి 6: బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు ఇప్పిస్తానని ఓ విద్యార్థి వద్ద రూ.70 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంతపల్లి గ్రామానికి చెందిన సురభి యాదగిరిగౌడ్ కుమారుడు సురభి అఖిల్గౌడ్ బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలనుకున్నాడు. సీటు కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన కిరణ్ వెంకటజంగం పరిచయమయ్యాడు.
ఎంబీఏ సీటు కావాలంటే రూ.70 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని కిరణ్.. అఖిల్గౌడ్కు చెప్పాడు. దీంతో గతేడాది జూన్ నుంచి అతని బ్యాంకు అకౌంట్కు విడతల వారీగా రూ.70 లక్షలు పంపించాడు. ఎంబీఏ సీటు రాకపోగా, అప్పటి నుంచి ఆన్లైన్లో కనిపించక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న అఖిల్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కిరణ్ను అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్కు తరలించినట్టు సీఐ వేణుకుమార్, ఎస్సై విజయకృష్ణ తెలిపారు.