వరంగల్, జూన్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వచ్చే నెల 7వ తేదీ నుంచి ఏడు రోజులపాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. బుధవారం ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఆయన వరంగల్ కోటను సందర్శించారు.
కాకతీయుల పాలన, కళావైభవం ప్రపంచానికి తెలిపేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. ఈ ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్చంద్రబాజ్దేవ్ను ప్రభుత్వపరంగా ఆహ్వానించనున్నట్టు చెప్పారు. సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజుయాదవ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.