హైదరాబాద్/పెద్దపల్లి, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: ఏపీలోని విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద బుధవారం ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు విశాఖ రూరల్ జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ చేపట్టగా, మావోయిస్టులు ఎదురుపడి కాల్పులకు దిగాయని తెలిపారు. అప్రమత్తమైన పోలీస్ బలగాలు ఎదురుకాల్పులు జరుపగా ఆరుగురు మావోయిస్టుల మృతిచెందారని తెలిపారు. ఘటనాస్థలంలో ఒక ఏకే -47, ఒక కార్బైన్, ఒక 303 రైఫిల్, ఒక తపంచా, కిట్ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు డాక్టర్ సందె అశోక్ అలియాస్ గంగయ్య(డీసీఎం) ఉన్నాడని అన్నారు. ఈ ఎన్కౌంటర్ నుంచి కొందరు మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికోసం హెలికాప్టర్ సాయంతో విస్తృతంగా గాలిస్తున్నట్టు తెలిసింది.