శంషాబాద్ రూరల్, మే 28: శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు భారీగా నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. శనివారం ఉదయం పాలమాకుల గ్రామం వద్ద తనిఖీలు చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు రోడ్డు పక్కన సంచులతో అనుమానాస్పదంగా కనిపించారు. వారిలో అంజప్ప (నంద్యాల పట్టణంలోని శ్రావణి లక్ష్మణ్ సీడ్స్ కంపెనీలో గుమాస్తా) పోలీసులకు పట్టుబడగా.. శేఖర్, సుభాష్ మనోహర్రెడ్డి అనే వ్యక్తులు పారిపోయారు. వీరంతా 11 సంచుల్లో 570 కిలోల నకిలీ విత్తనాలను తీసుకొచ్చారు.
నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ఎస్వోటీ అదనపు డీసీపీ నారాయణ, పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన మూల హరీశ్ మార్కెటింగ్ ఉద్యోగి. గతంలో విత్తనాల సంస్థలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన అనుభవంతో నకిలీ విత్తనాల దందాలో దిగి ఇప్పటికే రెండుసార్లు అరెస్టయ్యాడు.
జైలు నుంచి బయటకొచ్చాక ఏపీలోని నంద్యాలకు వెళ్లి అక్కడ విత్తన వ్యాపారి మహేశ్తో, నకిలీ విత్తనాలు సరఫరా చేసే హలీషా (పరారీలో ఉన్నాడు)తో పరిచయం పెంచుకొన్నాడు. వారి సాయంతో 4 క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలను ఓ వాహనంలో హైదరాబాద్కు తీసుకొచ్చాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు ప్రధాన సూత్రధారి హరీశ్, డ్రైవర్ హరిప్రసాద్ను పట్టుకున్నారు. హలీషా పరారయ్యాడు. ఈ ముఠా నుంచి రూ.16 లక్షల విలువైన నకిలీ విత్తనాలతోపాటు బొలెరో వాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.