హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 783 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ (డిసెంబర్ 29, 2022న నెంబర్ 28/2022 )ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి గురువారం (ఈనెల 16న) సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.