హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో 40% మేరకు బేసిన్ అవతలికి మళ్లిస్తున్నారని, ఏపీ రాష్ట్ర విభజనకు అదో ప్రధాన కారణమని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు చేతన్ పండిత్ వెల్లడించారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) ఏటా నిర్వహించే ‘వాటర్ వీక్’ కార్యక్రమం ఢిల్లీలో బుధవారం ప్రారంభమైంది. ‘నీటి భద్రతపై ప్రభావం చూపే అంతర్గత, అంతర్జాతీయ సరిహద్దు సమస్యలు- పరిషారం, నిర్వహణ వ్యూహాలు’ అనే అంశంపై తొలిరోజు కొనసాగిన సెషన్కు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఎస్ఎం హుస్సేన్ అధ్యక్షత వహించారు. చేతన్ పండిత్ ప్రసంగిస్తూ.. నదీజలాల భాగస్వామ్య ప్రయత్నాల్లో జాతీయ స్థాయి విధాన రూపకల్పనపై దృష్టి మరల్చాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని సూచించారు.
ఉమ్మడి ఏపీలో కృష్ణా బేసిన్ నుంచి ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపులో 40% మేరకు జలాలను బయట బేసిన్కు మళ్లించారని, అదే రాష్ట్ర విభజనకు ప్రధాన కారణంగా నిలిచిందని పేర్కొన్నారు. బేసిన్ ప్రజల అవసరాలను తీర్చకుండా ఆదేశిక హకులు, నదీతీర హకులను కాపాడకుంటే మున్ముందు ప్రాంతాల మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. అనంతరం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఎస్కే హల్దార్, డీఆర్ఆర్డీ మాజీ కార్యదర్శి అలోక్ రావత్, సీడబ్ల్యూసీ సీఈ బీపీ పాండే, భాక్రా బియాస్ బోర్డు కమిషనర్ ఎస్కే సిన్హా , నీటిపారుదల సెక్రటరీ జనరల్ ఏబీ పాండ్యా తదితరులు పలు అంశాలపై ప్రసంగించారు.
1.25 కోట్ల ఎకరాల ఇరిగేషన్ పొటెన్షియల్
అనంతరం నీతిఆయోగ్ సలహాదారు అవినాష్ మిశ్రా అధ్యక్షతన కొనసాగిన సెషన్లో తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజినీర్ వీ మోహన్కుమార్ ప్రసంగించారు. ‘డిమాండ్ అండ్ సప్లయ్కి తగిన నిర్వహణ వ్యూహాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, రైతుబంధు, సాంకేతికత వినియోగం, ప్రాధాన్య ప్రాజెక్టులు, ప్రాజెక్టుల ఆధునికీకరణ, పునర్నిర్మాణం, భూగర్భ జలాల నిర్వహణ, హరితహారం, రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక, నిర్వహణ, పైప్డ్ ఇరిగేషన్ తదితర కార్యక్రమాలు, వాటి విజయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాల వల్ల తెలంగాణలో నీటిపారుదల సామర్థ్యం (ఇరిగేషన్ పొటెన్షియల్) అనతి కాలంలోనే 1.25 కోట్ల ఎకరాలకు చేరిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ విశిష్టతలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పలు అవార్డులు, వాటి విశిష్టతల గురించి వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జల విభాగం ఈఈ సల్లా విజయ్కుమార్, డీఈఈ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.