హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ నలువైపులా నాలుగు మెగా గ్రంథాలయాలను త్వర లో ఏర్పాటు చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ బషీర్బాగ్లో శుక్రవారం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సకల వసతులతో ఏర్పాటుకానున్న నాలుగు మెగా గ్రంథాలయాల కోసం స్థల సేకరణ చేస్తున్నామని తెలిపారు. మన ఊరు -మన గ్రంథాలయం పేరుతో గ్రామాల్లో పౌర పఠనాలయాలను (రీడింగ్ హాళ్లను) ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గ్రంథాలయాల ఔట్సోర్సింగ్ పోస్టులకు జిల్లాల వారీగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఒక జిల్లాలోని గ్రంథాలయ సంస్థ నిధులను మరో జిల్లాకు బదలాయించేందుకు గ్రంథాలయ సంస్థల చైర్మన్లు సహకరించాలని కోరారు. త్వరలోనే సీఎస్తో సమావేశాన్ని నిర్వహించి అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ గ్రంథాలయాలు ప్రగతిమార్గంలో సాగుతున్నాయని, పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు అడిగిన పుస్తకాలను సమకూరుస్తున్నామని తెలిపారు. టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ నూతన గ్రంథాలయాల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, పనులను వేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ శ్రీనివాసచారి, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్నరామ్మూర్తి, చంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.