హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం జిల్లాలో అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురైన ఎర్రబోడు గ్రామం పదేండ్ల క్రితం అసలు ఉనికిలోనే లేదని అటవీశాఖ పేర్కొన్నది. అక్కడ 2013 వరకు దట్టమైన అడవి ఉండేదని తెలిపింది. అడవిని ధ్వంసంచేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించారని వెల్లడించింది. ఇందుకు ఉపగ్రహ చిత్రాలను సాక్ష్యంగా పేర్కొంది. గొత్తికోయలు నివసిస్తున్నట్టుగా చెప్తున్న ఎర్రబోడు గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా 2003 నుంచి ఎర్రబోడు అక్కడలేదని డీఎఫ్వో రంజిత్ నాయక్ చెప్పారు. 2013 తరువాత అక్కడ అటవీ ప్రాంతం కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చిందని, ఇందుకు ప్రధాన కారణం గొత్తికోయలు అక్కడ అడవిని నరికి నివాసం ఏర్పాటు చేసుకున్నారని, పోడు చేశారని తెలిపారు. ఉపగ్రహ చిత్రాల కాలక్రమాన్ని పరిశీలించినప్పుడు 2015-16లో అక్కడ కొన్ని గుడిసెలు వెలిశాయని, 2018 కల్లా ఇండ్ల నిర్మాణాలతో ఒక అవాసం ఏర్పడిందని వివరించారు. ఈ ఆవాసం చండ్రుగొండ మండలం బేడలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో మొత్తం 35 హెక్టార్లలో అడవిని నరికారని, ఇందులో 15 హెక్టార్లు కొత్తగూడెం డివిజన్లోకి వస్తుందని, మిగిలిన 20 హెక్టార్లు ఖమ్మం డివిజన్ పరిధిలోకి వస్తుందని విజిలెన్స్ డీఎఫ్వో రమణారెడ్డి తెలిపారు. కొత్తగూడెం డివిజన్లోని 10 హెక్టార్లలో తిరిగి మొక్కలు నాటామని చెప్పారు. పోడు చేసుకొనే వారికి ఆర్వోఎఫ్ఆర్ కింద సర్టిఫికెట్ జారీ చేస్తేనే వారు వ్యవసాయం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పట్టాలు ఇచ్చినా కూడా ఆ భూమిని సాగు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుందని, దానికి యజమాని అటవీ శాఖనేనని వెల్లడించారు. ఎలాంటి భూ హక్కులు ఉండవన్నారు.