హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్ల కంటే ఎక్కువ కాలం ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలనే ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు 81 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఏఆర్)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఐజీ వీబీ కమలాసన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2020 జనవరి 31 నుంచి 2024 జనవరి 31 వరకు కటాఫ్ డేట్ ప్రకారం.. నాలుగేండ్ల సర్వీస్ వచ్చే పోలీసు అధికారులు, ఇప్పటికే మూడేండ్లు పూర్తి చేసుకున్న పోలీసు అధికారులకు ఈ నిబంధన వర్తించింది.
ఈ మేరకు మల్టీజోన్-1 నుంచి 34 మంది ఏఆర్ సీఐలు, మల్టిజోన్-2 నుంచి 47 మంది ఏఆర్ సీఐలను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు ఐజీ ఆదేశాలు జారీ చేశారు. మల్టిజోన్-2 నుంచి ఐదుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీతో పాటు కొత్త పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో భూత్పూర్ సీఐ జీ రజితరెడ్డి, వెల్దండ సీఐ ఎస్ రామకృష్ణ, వనపర్తి సీసీఎస్ ఎస్ శ్రీనివాసచారి, మరికల్ సీఐ పీ శ్రీకాంత్రెడ్డి, జహీరాబాద్ సీఐ టీ భూపతి ఉన్నారు.