హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఎనిమిది నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని 33 పోలీస్ జాగిలాలు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యాయి. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శనివారం 33 పోలీస్ జాగిలాలు, 47 మంది జాగిలాల శిక్షకుల (హ్యాండ్లర్ల) పాసింగ్ ఔట్ పరేడ్ జరగనున్నది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాల్లో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్ర్టాన్ని నివారించడంలో వీటిని వినియోగిస్తున్నారు. తెలంగాణకు చెందిన 33 జాగిలాలతోపాటు గోవాకు చెందిన 17 జాగిలాలకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. లాబ్రడాల్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మాలినోస్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందిన జాగిలాలకు 8 నెలల్లో వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు.