హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్త ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన క్యాట్ ఎగ్జామ్ విద్యార్థులకు చుక్కలు చూపించింది. మధ్యా హ్నం నిర్వహించిన రెండో స్లాట్ పరీక్షాపత్రం అత్యంత కఠినంగా వచ్చింది. క్యాట్ పరీక్ష మూడు స్లాట్లలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 150 పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2.56 లక్షల విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు. రెండోస్లాట్ ఎగ్జామ్లో ప్రశ్నలు పెద్దవిగా ఉండటం, కొత్త రకమైన ప్రశ్నలు అడగటంతో విద్యార్థులు కంగారుపడ్డారు. 66 ప్రశ్నలకుగాను వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 24, టాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్లో 20, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 22 చొప్పున ప్రశ్నలిచ్చారు. ఈ మూడు సెక్షన్లలో ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో వీటిని చదివి అర్థం చేసుకొనేందుకు సమయం బాగా వెచ్చించాల్సి వచ్చింది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండటంతో ఇది కటాఫ్పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. మొదటి స్లాట్, మూడో స్లాట్ పరీక్షల్లో ప్రశ్నలు ఓ మాదిరి సులభంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. ఫలితాలను 2023 జనవరి మూడో వారంలో విడుదల చేయనున్నారు.