హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ఆర్జీయూకేటీలోని ఒక్కో సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన ల్యాప్టాప్ల పంపిణీపై దృష్టిసారించింది. పీయూసీ విద్యార్థులకు 2వేల ల్యాప్టాప్లను అందజేసేందుకు టీఎస్టీఎస్ సంస్థ ద్వారా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. వీటితోపాటు మరో వెయ్యి కంప్యూటర్లను కూడా సేకరించనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వర్సిటీలో మాడ్రన్ డాటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. యూనిఫారాలు, షూల సేకరణ టెండర్ల దశలో ఉన్నదని, వీటిని త్వరలోనే విద్యార్థులకు అందజేస్తామని వెల్లడించారు.
విద్యార్థుల ఘర్షణపై అప్రమత్తం
ఆర్జీయూకేటీలో పీయూసీ చదువుతున్న విద్యార్థులు ఘర్షణ పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘర్షణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొనేందుకు శనివారం క్రమశిక్షణ కమిటీ సమావేశం కానున్నది. సమావేశంలో ఘర్షణకు పాల్పడ్డ విద్యార్థులను విచారించి, వారిని కొద్దిరోజుల పాటు పర్యవేక్షించడం లేదా వర్సిటీ నుంచి బహిష్కరించడం వంటి చర్యల్లో ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
విద్యార్థుల ఫీజు 40% మాఫీ
బాసర ట్రిఫుల్ ఐటీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు (2019-20, 2020-21) సంబంధించిన ఫీజులో 40 శాతం మాఫీ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు జరగకపోవడం, వసతి గృహాల నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులపై భారం పడకుండా ఈ మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నారు. సాలర్షిప్తో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయాలని బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీని మంత్రి ఆదేశించారు.