వనపర్తి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది దళితులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వచ్చే బడ్జెట్లో ఇందుకోసం కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు. ఆదివారం వనపర్తిలోని పార్టీ శ్రేణులు, ప్రజలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన దళితులందరికీ ఈ పథకం కింద స్వయం ఉపాధి కోసం యూనిట్లు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ తదితర పథకాల అమలును పలు రాష్ర్టాలవారు అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. దేశ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో ఇది గొప్ప మార్పుగా ఆయన అభివర్ణించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో వనపర్తి జిల్లా అగ్రగామిగా నిలువాలని కోరారు.