హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన అపోలో హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ దవాఖానలో పేదలకు ఉచితంగా ఇన్ పేషెంట్ వైద్యసేవలు అందించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అపోలో 15 శాతం, బసవతారకం 25 శాతం చొప్పున పడకలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య కోసం వచ్చే పేదలకు ఉచితంగా కేటాయించాలని స్పష్టం చేసింది. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి బసవతారం క్యాన్సర్ దవాఖానలో రోజూ 40 శాతం మంది రోగులకు ఔట్ పేషెంట్ సేవలు ఉచితంగా అందించాలన్నది.
ఈ మేరకు గతంలో జారీ చేసిన రెండు వేర్వేరు జీవోల అమలుకు వీలుగా ప్రభుత్వం తాజాగా (జూలై 17) మార్గదర్శకాలను నిర్దేశిస్తూ జీవో (80) జారీ చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరతో అపోలో, బసవతారకం దవాఖానలు భూములు తీసుకున్నప్పుడు జరిగిన ఒప్పందం మేరకు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం లేదని పేరొంటూ ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించచారు. తుది ఉత్తర్వుల నిమిత్తం విచారణను హైకోర్టు ఆగస్టు 2కి వాయిదా వేసింది.