నాంపల్లి కోర్టులు, జూన్ 30 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్ను 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య తిరస్కరించారు. నిందితుడి తరఫున ఏడో బెయిల్ పిటిషన్ను కోర్టు ఎదుట న్యాయవాది దాఖలు చేశారు. సిట్ పీపీ కృష్ణయ్య చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది.
90రోజుల ముందే సిట్ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయడంతో నిందితుడి బెయిల్పై సందిగ్ధత నెలకొంది. నిందితుడికి వంద రోజులు పూర్తయ్యాయి. దొడ్డ శివారెడ్డి తరఫున వేసిన బెయిల్ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మరొక ప్రధాన నిందితుడు రాజశేఖరరెడ్డికి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖరరెడ్డితోపాటు ఇటీవల అరస్టైన మహ్మద్ ఖాలీద్, దొడ్డ శివారెడ్డి మాత్రమే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సయ్యద్ మహబూబ్కు 5రోజుల సిట్ కస్టడీ కొనసాగుతున్నది. దొడ్డ శివారెడ్డిని సైతం సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసులో 50వ నిందితుడి వరకు అందరికీ బెయిల్ మంజూరు కావడం విశేషం.